17 నుంచి ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఈనెల 17, 18, 19 తేదీల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యాన ఇంటర్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.చందు, బి.హరీష్ తెలిపారు. మోడల్ ఎంసెట్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరీక్షను ఎచ్చెర్లలోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో చాలామంది విద్యార్థులు ఎంసెట్ కోసం కోచింగ్ తీసుకొని పరీక్షకు నేరుగా వెళ్లి ఆందోళనకు గురై సరిగ్గా పరీక్ష రాయలేకపోయే వారికి ఇది మంచి అవకాశమన్నారు. విద్యారంగంలో సమస్యల పరిష్కారం, విద్యార్థుల హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి వారి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. విద్యార్థుల కోసం పోరాటాలు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉండే అకుంఠిత ప్రతిభను వెలికితీసి, వారి జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. అందులో భాగంగానే పదో తరగతి విద్యార్థులకు ప్రజ్ఞ వికాస్ పరీక్ష, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పోటీ పరీక్షలంటే భయం పోగొట్టేందుకు మోడల్ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.రాజు, జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.