ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం తోటపాలెంలోని ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కేంద్రాస్పత్రి మెడికల్ ఆఫీసర్ శిరీష, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎస్ఎఫ్ఐకి మాత్రమే చెల్లిందని, ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుక్దేవ్ అని, అటువంటి మహాత్ముల దారిలో నడిచే ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూనే, ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులకు కళాశాల ప్రిన్సిపల్ చిన్నం నాయుడు అభినందించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హరీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె .రవికుమార్, ఎం.హర్ష, డివైఎఫ్ఐ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.