సిద్ధం సభకు రూ.300, బిర్యానీ అంటా..!

Mar 10,2024 23:55

– చీరాల్లో ఓ కౌన్సిలర్‌ వాయిస్ మెసేజ్ హల్ చల్
– జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్ది నిలిచిన వాహనాలు
ప్రజాశక్తి – చీరాల
కొరిశపాడులో జరిగిన సిఎం వైఎస్‌ జగన్‌ సిద్ధం సభకు హాజరయ్యే వారికి రూ.300 నగదు, బిర్యానీ, బస్సు ఏర్పాటు చేశామని, మార్గ మధ్యలో మద్యం బాటిల్ కుడా అందుతుందని కౌన్సిలర్ బాలకృష్ణ చెప్పమన్నారంటూ ఓ వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో పట్టణంలో ఆదివారం హల్చల్ చేసింది. వార్డు ప్రజలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆ వాయిస్ సారాంశం. అయితే ఆ వాయిస్ మెసేజ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారని కౌన్సిలర్ బాలకృష్ణ కొట్టిపారేశారు. సిద్ధం సభకు వెళ్లేందుకు ప్రయాణిస్తున్న చీరాల, ఒంగోలు జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. సిద్ధం సభకు ప్రధాన రహదారి కావడంతో వాహనాలన్ని అదే రహదారి గుండా వెళ్లడంతో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు రహదారిపైకి రావటంతో ఒంగోలు – చీరాల రాకపోకలు సాగించే వారు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సి వచ్చింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నించిన బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాలు ఎక్కువగా ఉండటంతో నియంత్రించడం ఇబ్బందిగా మారింది. పోలీసుల చొరవతో చివరికి ట్రాఫిక్ సమస్య తీరింది.

➡️