చెన్నై : పబ్లో పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషాద ఘటన గురువారం సాయంత్రం తమిళనాడులోని చెన్నైలో జరిగింది.
చెన్నై నగరం అల్వార్ పేట్ లోని అప్ మార్కెట్ ఏరియాలోని సెఖ్ మెట్ పబ్ బార్లో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను మణిపూర్కు చెందిన లాలీ (22), మ్యాక్స్(21), తమిళనాడులోని దుండిగల్కు చెందిన రాజ్(45)గా గుర్తించారు. శిథిలాల కింద మరో ముగ్గురు ఉండొచ్చని గ్రేటర్ చెన్నై అడిషనల్ కమిషనర్ ప్రేమ్ ఆనంద్ సిన్హా తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ పబ్కు 50 అడుగుల దూరంలోనే బోట్ క్లబ్ మెట్రో స్టేషన్ పనులు జరుగుతున్న కారణంగా.. పబ్ సీలింగ్ కూలి ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీటిని మెట్రో రైలు అధికారులు ఖండించారు. టన్నెల్ వర్క్ ప్రస్తుతానికి 500 మీటర్లు మాత్రమే పూర్తయ్యిందని చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.