ముంబయి : వరుసగా నాలుగు రోజులు నష్టాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం స్వల్ప ఉపశమనం లభించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఆందోళన వాతావరణం వల్ల గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కాగా.. వారంతం సెషన్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో బిఎస్ఇ సెన్సెక్స్ 599 పాయింట్లు పెరిగి 73,088 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 151 పాయింట్లు రాణించి 22,147 వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, మారుతీ సుజుకి సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరసలో ఉన్నాయి.