ఇంటర్నెట్డెస్క్ : సీజన్ మారితే చాలు.. చిన్నారులకు జలుబు, దగ్గు సమస్యలు వెంటాడుతాయి. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా సరే వీటి నుంచి ఉపశమనం లభించదు. విపరీతమైన దగ్గుతో రాత్రిపూట నిద్రలేక సతమతమవుతారు. మరి చిన్నారులు ఈ వ్యాధుల నుంచి ఉపశమనం లభించాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి అని ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ సలహా ఇచ్చారు. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా..?!
వాము కొద్దిగా, లవంగాలు – రెండు, మిరియాలు – నాలుగు, బెల్లం – టేబుల్ స్పూను, నెయ్యి – కొద్దిగా, అల్లం పేస్టు – అర టేబుల్ స్పూను, పసుపు- చిటికెడు. వీటన్నింటినీ ఒక గ్లాసు నీటిలో వేసుకుని కొద్దిసేపు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి, తీసుకోబోయే ముందు నెయ్యి వేసుకోవాలి. ఈ నీటిని చిన్నారులతోపాటు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ నీటిని చిన్నారులు తాగితే జలుబు దగ్గు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారని రవీనా టాండన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. ఇందులో వాడిన పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవేనని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.