జనవరి 31లోగా రేషన్‌కార్డు, ఆధార్‌ నంబర్లను అనుసంధానం : దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌

Dec 31,2023 15:05 #ration card, #Telangana

తెలంగాణ: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌ అందజేస్తోంది. ప్రస్తుతం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉచిత రేషన్‌ ఇవ్వబడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్‌కార్డుల వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. సబ్సిడీ రేషన్‌తో పాటు సంక్షేమ పథకాలు అందుకోవాలంటే తప్పనిసరిగా రేషన్‌ కార్డు ఉండాలి. అయితే.. దేశంలోని చాలా ప్రాంతాల్లో బోగస్‌ రేషన్‌ కార్డులతో ఆధార్‌ నంబర్‌ (ఈ కేవైసీ)ని లింక్‌ చేయాలని కేంద్రం చెబుతోంది. రేషన్‌కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకునే గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. ఇటీవల, గడువు జనవరి 31, 2024 వరకు పొడిగించబడింది. జనవరి 31లోగా రేషన్‌కార్డు, ఆధార్‌ నంబర్లను అనుసంధానం చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌ దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కేవైసీ పూర్తికాకపోతే రేషన్‌లో కోత విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.గత రెండు నెలలుగా రేషన్‌ షాపుల్లో డీలర్లు ఈ-కేవైసీ సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆధార్‌ వెరిఫికేషన్‌, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. ఎవరైనా ఆధార్‌ లింక్‌ చేసుకోని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ రేషన్‌ కార్డుతో ఆధార్‌ కార్డు సీడింగ్‌ చేసుకోని ఖాతాదారుల రేషన్‌ కార్డును నకిలీగా భావించి డిలీట్‌ చేయనుంది ప్రభుత్వం. అంతేకుండా.. ఇలా డిలీట్‌ అయినట్లయితే ప్రభుత్వ డేటాలో మీ రేషన్‌ కార్డు వివరాలు తొలిగిపోతాయి. దాంతో మీకు వచ్చే రేషన్‌ సరుకులు నిలిచిపోతాయి. రేషన్‌ కార్డును ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేయడానికి మీరు మీ రేషన్‌ కార్డ్‌లోని సభ్యులందరి ఆధార్‌ నంబర్‌ను ఇవ్వాలి. వాటి ఆధారంగా ఈ కేవైసీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌ 30 నాటికి 70.80 శాతం ఈ కేవీసీ పూర్తయింది. 87.81 శాతం నమోదుతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 54.17 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

➡️