లండన్ : కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంగ్లండ్లో పర్యటిస్తున్నారు. మంగళవారం లండన్ చేరుకున్న ఆయన తవిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహనికి నివాళులర్పించారు. ఇంగ్లండ్లో ఆయన బుధవారం కూడా పర్యటించనున్నారు. గాంధీజీకి నివాళులర్పించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ బ్రిటన్ రక్షణ మంత్రి గ్రాంట్ షాప్స్తో చర్చలు జరిపారు. క్యాడెట్ మార్పిడి కార్యక్రమం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పైన, అలాగే రక్షణ పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన పరస్పర సహకారానికి ఉద్దేశించిన ఒప్పందాలపైనా ఇరువురు సంతకాలు చేశారు. గ్రాంట్ షాప్స్తో చర్చలు ఫలవంతంగా జరిగాయని భేటీ అనంతరం రాజ్నాథ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. భారత రక్షణ మంత్రి ఇంగ్లండ్లో పర్యటించడం 22 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ చివరిసారిగా ఇంగ్లండ్లో పర్యటించారు.