‘రాజధాని ఫైల్స్’ పొలిటికల్ సినిమా కాదు.. :  డైరెక్టర్ భాను

Feb 14,2024 17:52 #New Movies Updates

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో, కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఇటివలే విడుదలైన ట్రైలర్ అద్భుతమై స్పందనతో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు భాను విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  

అమరావతి ఫైల్స్ పేరుని ‘రాజధాని ఫైల్స్’ గా మార్చడానికి కారణం ?
-మొదట అమరావతి ఫైల్స్ పేరుతోనే తీశాం. సెన్సార్ కి వెళ్ళినప్పుడు ఫిక్షనల్ చేస్తేనే సెన్సార్ ఇస్తామని చెప్పారు. వారు చెప్పిన కరెక్షన్స్ చేశాం. టైటిల్ ని రాజధాని ఫైల్స్ గా మార్చాం. అలాగే ఇందులో వాడిని మ్యాప్స్, పేర్లపై రీవర్క్ చేసి,  డబ్బింగ్ లో మార్పులు చేశాం. దిని కారణంగా బడ్జెట్ కూడా అదనంగా ఖర్చయ్యింది. కరెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ రావడం జరిగింది.

‘రాజధాని ఫైల్స్’ రాజకీయ కోణం ఉందా ?
ఇది రాజకీయ చిత్రం కాదు.. ప్రజల చిత్రమని మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. ప్రజల ఆవేదనని చూపించే చిత్రమిది. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని నమ్మి తమ భూములు ఇచ్చారు. మరో ప్రభుత్వం వచ్చి వారిపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టింది. ప్రజలు నమ్మింది ప్రభుత్వాన్ని కాని, పార్టీలని కాదు. ఈ అంశాన్నే సినిమాలో చూపించబోతున్నాం.  ఇది పొలిటికల్ కంటెంట్ కాదు. రైతుల పడిన ఇబ్బందులు, మానసిక సంఘర్షణ, వారిని ఇబ్బంది పెట్టె మనుషులు, న్యాయం కోసం రైతులు చేసిన పోరాటం తప్పితే పొలిటికల్ కోణం ఇందులో వుండదు. ఇందులో సమస్యకి పరిష్కారం కూడా చూపించాం.

ట్రైలర్ లో గుడివాడ అనే పాత్రపై సెటర్లు పాటలు కనిపించాయి ఇది పొలిటికల్ కాదా ?
లేదండీ. ఇది రైతుల కథ. వారి  జీవితాల్లోకి వచ్చి ఇబ్బంది పెట్టిన వారి పాత్రలనే తీసుకున్నాం కానీ ఎవరి వ్యక్తిగతాల జోలికి పోలేదు. ట్రైలర్ చూపించిన క్లబ్బు, పాట కూడా నా కథలో ఒక అంశం. దానికి గుడివాడ అనే పదం వాడుకున్నాం.

ఈ సినిమా చిత్రీకరణలో పై ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చాయా ?
లేదండీ. అమరావతి వెళ్లి బాదిత రైతులతో ఈ సినిమా చిత్రీకరణ చేశాను.  నిజమైన సంఘటనల ఆధారంగా సినిమా చేసినప్పుడు ఆ సంఘటన ఎదుర్కున్న వారే వచ్చి సినిమాలో నటించడం చాలా అరుదు. ఇందులో మాత్రం బాదితులే తమ పాత్రలని పోషించారు. ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరగలేదు.

ఈ సినిమా చేయడానికి ఏ అంశం మిమ్మల్ని బలంగా ఆకర్షించింది ?
రవిశంకర్ గారు సినిమా చేయలన్నప్పుడు ముందు భయపడ్డాను. అయితే ఒక సామజిక భాద్యతతో నిర్మాత సినిమా తీస్తామని వచ్చినప్పుడు చేయాలనిపించింది. ముందు అమరావతి రైతులని కలిశాను. వారు పడిన ఇబ్బందులు చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఓ అమ్మాయిని పోలీసులు అమానుషంగా కొట్టారు. ఇప్పటికీ ఆ అమ్మాయి లేవలేకపోతుంది. దాదాపు రెండు వందల మందికి పైగా రైతులు భూమి కోల్పోయామని గుండె ఆగి చనిపోయారు. ఇంత మానసిక సంఘర్షణ పడిన రైతుల కోసం ఈ సినిమా చేయాలని అనుకున్నాను. ఈ ప్రయాణంలో రవిశంకర్ గారు అద్భుతంగా  ప్రోత్సాహించారు.

ట్రైలర్ లో ఎక్కువ గా బర్నింగ్ కనిపించింది ?
ఈ కథలోనే బర్నింగ్ వుంది. నేచురల్ గా కనిపించాలని తీశాను.  ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు ఒక సజీవ చిత్రంలా వుందని చెప్పడానికి కారణం ఇదే. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కాకుండా కళ్ళముందు జరుగుతన్న కథలా కనిపిస్తుంది. మా కెమరామెన్ కేవీ ఆనంద్ అసిస్టెంట్. తెలుగులో కొన్ని ప్రముఖ చిత్రాలకు పని చేశాడు. తన అనుభవంతో అవుట్ డోర్ షూటింగ్ ని  అద్భుతంగా చేశాడు.

సినిమా మొత్తం చూసుకున్న తర్వాత ఏం అనిపించింది ?

చాలా తృప్తిగా అనిపించింది. జీవితానికి ఈ ఒక్కటి చాలు అనిపించింది. ఈ సినిమా ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది. ఇది జాతీయ జెండా లాంటి సినిమా. ప్రజల సినిమా. సమాజానికి ఉపయోగపడే సినిమా.

వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ పాత్రలు ఎలా వుంటాయి ?
రైతు ప్రతినిధి పాత్రలో వినోద్ కుమార్ గారు, రైతు భార్యగా వాణీ విశ్వనాథ్ గారు కనిపిస్తారు. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మాటలు, పాటలు, ఎడిటింగ్ అన్నీ వున్నత స్థాయిలో వుంటాయి. ఇది యూనీవర్సల్ అందరికీ నచ్చే సినిమా.

➡️