కాంగ్రెస్‌తోనే అభివద్ధి సాధ్యం : రఘువీరారెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లతో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి

        మడకశిర : కాంగ్రెస్‌ పార్టీతోనే అభివద్ధి సాధ్యమని సిడబ్ల్యుసి సభ్యుడు, మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి తెలిపారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని అమరాపురం మండలం గునేహళ్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేశామన్నారు. అలాంటి అభివృద్ధి జరగాలంటే మరొకసారి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన హంద్రీనీవా కాలువ పనులను వెంటనే పూర్తి చేయడానికి తమ వంతుగా కషి చేస్తామన్నారు. శ్రీరామరెడ్డి మంచినీటి పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు వలస పోకుండా మడకశిర సమీపంలో ఇండిస్టియల్‌ ఏరియాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మడకశిర కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్‌, కన్వీనర్లు గురుమూర్తి, గౌడ్‌ అప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

బంగారు పతకం సాధించిన విద్యార్థికి అభినందన

        నియోజకవర్గ పరిధిలోని అమరాపురం మండలం కెంప్పాక్కహట్టి గ్రామానికి చెందిన అనిత కర్నాటకలో ఎంకామ్‌ పూర్తి చేసి అందులో బంగారు పతకం సాధించింది. ఈ విద్యార్థినిని సిడబ్ల్యుసి మెంబర్‌ రఘువీరారెడ్డి గురువారం సన్మానించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రఘువీరారెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా బంగారు పతకం సాధించిన విద్యార్థిని గురించి తెలుసుకున్న రఘువీరారెడ్డి ఆమెను సన్మానించారు.

➡️