న్యూఢిల్లీ : యుపిఐ డిజిటల్ లావాదేవీల పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం ఆస్పత్రులు, విద్యా సంస్థలకు చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యుపిఐ చెల్లింపుల పరిమితిని పెంచినట్లు గవరుర్ శక్తికాంత దాస్ తెలిపారు. రికరింగ్ చెల్లింపుల కోసం ఇచ్చే ఇ-మ్యాండేట్ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.15 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచామని చెప్పారు. ఇప్పటి వరకుఆటో డెబిట్ లావాదేవీ విలువ రూ.15 వేలు దాటితే ‘అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్’ కింద వినియోగదారులు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలి. తాజా నిర్ణయంతో లక్ష వరకుఎలాంటి అదనపు అథెంటికేషన్ అవసరం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేసే మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్, బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉండదు.