చండీగఢ్ : కన్నౌరి సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మఅతిచెందిన రైతు శుభ్కరణ్ సింగ్ కుటుంబానికి శుక్రవారం పంజాబ్ సిఎం భగవంత్మాన్ సింగ్ కోటి రూపాయల ఆర్థిక పరిహారం ప్రకటించారు. అతని చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. శుభ్కరణ్ మఅతికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత హామీ కల్పించాలన్న డిమాండ్తో రైతులు చేపట్టిన శాంతియుత నిరసనపై బుధవారం పోలీసులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కన్నౌరి సరిహద్దులో జరిగిన ఈ ఘటనలో యువరైతు శుభకరణ్ మరణించాడు. శుభ్కరణ్ ప్రచారం కోసం ఆందోళనల్లో పాల్గొనేందుకు రాలేదని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర డిమాండ్ చేసేందుకు వచ్చినట్లు సీఎం భగవంత్మాన్ వెల్లడించారు. రైతులకు పంజాబ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.
రాష్ట్రపతి పాలన విధిస్తామని మమ్ముల్ని బెదిరిస్తున్నారని, ఆ బెదిరింపులకు తానేమీ బెదిరేది లేదన్నారు. మరో శుభ్కరణ్ మృతి చెందకుండా చూస్తానని సిఎం భగవంత్మాన్ అన్నారు. మమ్ముల్ని బెదిరించడానికి ముందు మణిపూర్, నుహ్ గురించి ఆలోచించాలన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో శాంతి భద్రతల విఘాతానికి హర్యానా పోలీసులే కారణమని తెలిపారు. ఎవరికీ ఎటువంటి ట్రబుల్ ఇవ్వడం లేదన్నారు. తమ అహంకారాన్ని పక్కన పెట్టి, రైతుల డిమాండ్లను పూర్తి చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.