ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ బర్రె వెంకట రమణ పిలుపునిచ్చారు. శనివారం నరసాపురం కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకూ పల్స్ పోలియోపై హెల్త్ ,అంగనివాడీ ,మున్సిపల్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్ చైర్మన్ బర్రె వెంకట రమణ, కమీషనర్ కె.వెంకటేశ్వరరావు కలసి ప్రారభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట రమణ, కమీషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మార్చి 3 నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు. మార్చి 3వ తేదీన బూత్ స్థాయిలో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. పట్టణంలో 40 బూత్లలో మార్చి నెల మొదటి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కారిచర్ల.మోహన, పి.సోనియా, సత్యభూషణ్, హెల్త్ సూపర్ వైజర్లు, ఏయన్.యం, ఆశాలు, అంగనివాడీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.