ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం ఎంవిఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 2023-24 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 200 మందికి, ఇంటర్ విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ మెటీరియల్ను యుటిఎఫ్ తూర్పుగోదావరి జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు మంగళవారం స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కూడా ఈ మెటీరియల్ చదివిన విద్యార్థులు ఉత్తీర్ణులై, మంచి గ్రేడు పాయింట్లతో, ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా అటువంటి ఫలితాలు రావడానికి ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. విద్య, విద్యార్థులపై ఉన్న మక్కువ కారణంగా ఈ మెటీరియల్ కు సొంత నిధులు సుమారు ఇరవై వేల రూపాయలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. తొలుత దివంగత నాయకులు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన అనంతరం స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబును ప్రధానోపాధ్యాయులు వి.విశ్వప్రసాద్, ఉపాధ్యాయులు ఉదయ భాస్కర్, ఆళ్ళ సుబ్బారావు, దుర్గా ప్రసాద్ , మతి అజూబా, నాగసుందరి, పద్మావతి, పద్మజారాణి, నాగజ్యోతి, తదితరులు ప్రశంసించారు.