ఢిల్లీలో నిరసన సెగలు

Mar 27,2024 09:07 #continues, #Delhi, #Protests
  • ప్రధాని నివాసం వద్ద ఘెరావ్‌కు యత్నం
  • పలువురి అరెస్టు
  • భారీగా బలగాల మోహరింపు
  • పోలీసు రాజ్యంగా మార్చేశారన్న ఆప్‌
  • 31న మెగా ర్యాలీ ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు

న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద ఘెరావ్‌కు యత్నించారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘కేజ్రివాల్‌ జిందాబాద్‌’ అన్న నినాదాలు ఆ ప్రాంతమంతటా హోరెత్తాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ఇక్కడి పటేల్‌ చౌక్‌ నుంచి బయల్దేరిన ప్రదర్శన తుగ్లక్‌ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోడీ నివాసం వైపు సాగింది. ప్రదర్శన పటేల్‌ చౌక్‌ వద్దకు చేరుకోగానే ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్లు పోలీస్‌ వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్‌ కు తరలించారు. ఆప్‌ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో ప్రధాని నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సెంట్రల్‌ ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్ళే, వచ్చే మార్గాలను భద్రతా కారణాలను సాకుగా చూపి మూసివేవేశారు. పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ఆప్‌ ఢిల్లీ శాఖ కన్వీనర్‌, ఢిల్లీ మంత్రి గోపాల్‌ రారు మాట్లాడుతూ ఢిల్లీని పోలీస్‌ రాజ్యంగా మార్చివేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకునేవారంతా మోడీ ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని రారు పిలుపునిచ్చారు.. ఈ నెల 31న ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్‌లో మహా ర్యాలీ నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇండియా బ్లాక్‌ నుండి పలువురు నేతలంతా ఈ ర్యాలీలో పాల్గొననున్నారని రారు చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీనియర్‌ ఆప్‌ నేతలు సోమ్‌నాథ్‌ భారతి, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రాఖి బిర్లా, పంజాబ్‌ మంత్రి హర్‌జోత్‌ సింగ్‌ బైన్స్‌ తదితరులు వున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆప్‌ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆప్‌ సీనియర్‌ నేత సోమ్‌నాథ్‌ భారతి వ్యాఖ్యానించారు. ఎక్స్‌లో పోస్టు పెడుతూ, తనతో పాటు డిప్యూటీ స్పీకర్‌ రాఖి బిర్లా తదితరులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఈ నెల 21న కేజ్రివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు పై దేశవ్యాపితంగా నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి.

కేజ్రివాల్‌ అరెస్టుపై స్పందించిన అమెరికా
కేజ్రివాల్‌ అరెస్టుపై అమెరికా స్పందించింది. సక్రమమైన, పారదర్శకతతో కూడిన విచారణా క్రమాన్ని చేపట్టగలరని ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఇ-మెయిల్‌లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి పై విధంగా స్పందించారు. గతంలో జర్మనీ కూడా ఇదే రీతిలో స్పందించడంతో తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని మోడీ ప్రభుత్వం ఆక్రోశం వ్యక్తం చేసింది జర్మనీ రాయబారిని పిలిచి తమ నిరసన తెలియచేసింది. ఇది జరిగిన రెండు రోజులకే అమెరికా కూడా ఇదే రీతిలో స్పందించింది.

సోషల్‌ మీడియా వేదికగా కేజ్రీవాల్‌కు సంఘీభావం
కేజ్రీవాల్‌కు సంఘీభావం కూడగట్టేందుకు ఆప్‌ సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకున్నది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్‌ నేతలు, కార్యకర్తలు తమ ప్రొఫైల్‌ చిత్రాలను మార్చారు. కటకటాల వెనుక ఉన్న కేజ్రీవాల్‌ చిత్రాన్ని డిస్‌ప్లేలో పోస్ట్‌ చేశారు. మోడీ కా సబ్సే బడా దార్‌ కేజ్రీవాల్‌ (మోడీని అత్యంత భయపెట్టిన కేజ్రీవాల్‌) అనే శీర్షికను డిస్‌ప్లే కింద పోస్ట్‌ చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతునివ్వాలని కోరుతూ ఆప్‌ ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించింది.

కేజ్రివాల్‌ పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని, ఆరు రోజులు రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్‌ స్వర్ణకాంత్‌ శర్మ ఈ పిటిషన్‌పై ఉదయం 10.30గంటలకు విచారణ జరపనున్నారు. అరెస్టు, రిమాండ్‌ రెండూ చట్ట విరుద్ధమైనవేనని, అందువల్ల కేజ్రివాల్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆప్‌ లీగల్‌ బృందం వాదిస్తోంది. మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఆప్‌నేతలు మనీష్‌ సిసోడియా, సంజరుసింగ్‌ ఇప్పటికే జ్యుడీషియల్‌ కస్టడీలో వున్నారు. తన అరెస్టును సవాలు చేస్తూ తొలుత కేజ్రివాల్‌ సుప్రీంలో పిటిషన్‌ వేసినా, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. అనంతరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

➡️