అభ్యుదయ వివాహాలు – సామాజిక బాధ్యత

Feb 14,2024 07:15 #Editorial

వివాహానికి 21 ఏళ్లు నిండిన యువకుడు, 18 ఏళ్లు నిండిన యువతి ఉంటే చాలు. కులమేదైనా, మతమేదైనా, ప్రాంతమేదైనా, భాష వేరైనా, దేశం వేరైనా ప్రేమించుకొని జీవిత భాగస్వాములుగా వుండే హక్కు రాజ్యాంగబద్ధంగా కల్పించబడింది. వివాహానికి ముందు చూడాల్సింది కులం, మతం కాదు. ఆస్తులు అంతస్తులు అంతకన్నా కాదు. కట్నాలు, డబ్బులు అవసరమే లేదు, గుణం గొప్పదై ఉండాలి. మతం కంటే మానవత్వం ఉండాలి. మల్లె పువ్వు లాంటి మనసు, కష్టసుఖాల్లో ఒకరికొకరు కంటికి రెప్పలా కాపాడుకోగలరా అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. జీవిత కాలం కలిసి ఉండడానికి జీవనోపాధి తప్పనిసరి. రెండు మనసులు కలిసి మానసిక ఐక్యత సాధించిన వ్యక్తులు కేవలం కులం కారణంగా దూరం కాకూడదు. పరస్పరం చర్చించుకుని వాటిపై అంగీకారం కుదిరితే ఆదర్శ వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఉండకూడదు.

                  ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ కేవలం మన దేశంలో మాత్రమే ఉంది. మూడు వేల ఏళ్ల కిందటి మనుస్మృతి మానసిక చట్టాల ఫలితంగా ఏ కులంలో పుట్టినవాడు ఆ కులంలోనే వివాహం చేసుకోవాలి, ఆ కులంలో చావాలి. ఇది మన భారతదేశంలో మాత్రమే ఉన్న ఒక దుర్మార్గపు మానసిక నిబంధన. చట్టాలు అందరికి తెలియదు. కానీ, మనుస్మృతి మానసిక చట్టాలు వేల ఏళ్లగా వంశపారంపర్యంగా అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అని తేడా లేకుండా అమలు చేస్తున్నారు. దీంతో కులం భారతదేశంలో క్యాన్సర్‌ కంటే ప్రమాదకరమైన జబ్బుగా మారింది. కులం కట్టుబాట్లను తొలగించడానికి దేశంలో అనేక ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించబడ్డాయి. కుల నిర్మూలన జరగాలని కలలుకన్న వారి ఆశయాలు నేటికీ నెరవేరలేదు. జ్యోతిబా పూలే, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, కమ్యూనిస్టు నేతలు, నాస్తికవాదులు…కుల నిర్మూలన కోసం అనేక త్యాగాలు చేశారు. కుల వ్యవస్థ కొనసాగింపు వివాహ వ్యవస్థలోనే దాగి ఉందని గ్రహించారు.కుల నిర్మూలన జరగాలని భారత రాజ్యాంగం నిర్దేశించుకున్నది. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు ఓ మెట్టులాగా ఉంటాయని భావించింది. కులాంతర వివాహాలను చేసుకున్న వారిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కొన్ని పారితోషకాలు కూడా ఇస్తున్నది. అందుకే ఆ రోజుల్లోనే జ్యోతిబా పూలే పూజారి లేని అభ్యుదయ వివాహాలను పూలదండలు మార్చడం ద్వారా జరిపించారు. వారి అడుగుజాడల్లో నేటి పౌర సమాజం అభ్యుదయ వివాహాలను ప్రోత్సహించే సామాజిక బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. వివాహానికి 21 ఏళ్లు నిండిన యువకుడు, 18 ఏళ్లు నిండిన యువతి ఉంటే చాలు. కులమేదైనా, మతమేదైనా, ప్రాంతమేదైనా, భాష వేరైనా, దేశం వేరైనా ప్రేమించుకొని జీవిత భాగస్వాములుగా వుండే హక్కు రాజ్యాంగబద్ధంగా కల్పించబడింది. వివాహానికి ముందు చూడాల్సింది కులం, మతం కాదు. ఆస్తులు అంతస్తులు అంతకన్నా కాదు. కట్నాలు, డబ్బులు అవసరమే లేదు, గుణం గొప్పదై ఉండాలి. మతం కంటే మానవత్వం ఉండాలి. మల్లె పువ్వు లాంటి మనసు, కష్టసుఖాల్లో ఒకరికొకరు కంటికి రెప్పలా కాపాడుకోగలరా అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. జీవిత కాలం కలిసి ఉండడానికి జీవనోపాధి తప్పనిసరి. రెండు మనసులు కలిసి మానసిక ఐక్యత సాధించిన వ్యక్తులు కేవలం కులం కారణంగా దూరం కాకూడదు. పరస్పరం చర్చించుకుని వాటిపై అంగీకారం కుదిరితే ఆదర్శ వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఉండకూడదు. ఏ అర్హతలు లేకపోయినా పర్వాలేదు కానీ, మా కులం వాడైతే చాలు. అది బాల్యవివాహమైనా లక్షల రూపాయల కట్నాలు పోసైనా, మా కులం వాడికే ఇచ్చి వివాహం చేస్తాను. మా కులం కానీవాడిని ప్రేమిస్తే ఊరుకోం, అవసరమైతే కన్నబిడ్డనైనా కడతేరుస్తాం అనే వారున్న సమాజమిది.

తమ కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదని, తన అల్లుడిని సుపారీ ఇచ్చి నరికి చంపుతున్నటువంటి ఉదంతాలను కళ్లారా చూస్తున్నాం. ప్రేమికులపై ఎందుకింత కుల, మత విద్వేషాలు? నేడు దేశంలో కుల దురహంకార హత్యలు పెరిగిపోయాయి. ఆధిపత్య కులరక్కసి విషపు నాగులాగా బుసలు కొడుతున్నప్పుడు కుల దురహంకార హత్యలు పెచ్చరిల్లుతున్నాయి. సమాజాభివృద్ధిని కాంక్షించే సామాజిక ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు అభ్యుదయ వివాహాలకు అండగా నిలుస్తున్నప్పటికీ మెజారిటీ సమాజం మనువాద కుల సంస్కృతి అడ్డుగోడల్ని ఛేదించలేకపోతున్నది. ఇది మారాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రేమించుకున్న వారిని చేరదీసి ఆదర్శ వివాహాలను జరిపించాలి. కుల, మతాంతర పెళ్లిళ్లను ప్రోత్సహించడం కోసం ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలి. కుల దురహంకారుల పంచన చేరి ప్రేమికులను దూరం చేయరాదు.

2017లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పెరుమాండ్ల ప్రణరు అనే దళిత యువకుడు అమృత అనే వైశ్య యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోటి రూపాయల సుపారీ ఇచ్చి అమృత తండ్రి మారుతీరావు అత్యంత క్రూరంగా ప్రణరుని నరికి చంపించాడు. ఈ ఒక్క ఘటన చాలు కుల దురహంకారం ఎలా రాజ్యమేలుతుందో చెప్పడానికి. కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించి, కుల దురహంకార శక్తులను పంచన చేర్చుకునే మతోన్మాద శక్తులు కూడా మన మధ్యలోనే ఉన్నాయన్న సంగతి మరవరాదు. బజరంగ్‌దళ్‌, విహెచ్‌పి, ఎబివిపి కి చెందిన మనువాద మతోన్మాదులు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున, పార్కుల దగ్గర మారణాయుధాలతో, కర్రలతో దాడులకు దిగుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. సమాజ అభ్యుదయాన్ని సహించలేని తిరోగమన శక్తులకు బుద్ధి చెప్పడానికి, ప్రేమికుల రోజున కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) వంటి సంస్థలు అభ్యుదయకరమైన దంపతులను అభినందిస్తూ సభలు నిర్వహిస్తున్నది.

కుల దురహంకార హత్యలు, దాడుల తర్వాత ప్రేమికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. వారికి రక్షణ కల్పించాలి. వారి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యతనివ్వాలి. ఇంటి స్థలం ఇచ్చి ఇల్లునిర్మించి ఇవ్వాలి. వారి పిల్లల చదువులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అనేక జీవోలు ఉన్నప్పటికీ అవేవీ అమలుకు నోచుకోవటం లేదు. రాజస్థాన్‌ ప్రభుత్వం కులాంతర వివాహితుల ప్రత్యేక రక్షణ చట్టం చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. మన తెలుగు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ చట్టం చేయాలి. పోలీసు వైఖరిలో కూడా తీవ్రమైన మార్పులు రావాల్సి ఉంది. కేవలం వయసు మాత్రమే గీటురాయిగా పరిగణించి అలాంటి వివాహాలను పోలీస్‌ స్టేషన్‌లోనే జరిపించి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలి. దాడులకు, దౌర్జన్యాలకు చోటు లేకుండా కుల దురహంకార హత్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజ అభ్యుదయం కాంక్షించే అన్ని రాజకీయ పార్టీలు వారి పార్టీలో ప్రతి ఏటా ఎన్ని కులాంతర వివాహాలు జరిపించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. అభ్యుదయ వివాహాలు మన దేశ భవిష్యత్తుకు దోహదం చేస్తాయి. కులరహిత భారత్‌గా రూపుదిద్దుకోవటానికి మొట్టమొదటి మెట్టుగా ఉంటాయి. కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, పౌర సమాజంపైనా ఉంది.

/ వ్యాసకర్త సెల్‌ : 9177549646 /(ఫిబ్రవరి14 ప్రేమికుల దినోత్సవం) స్కైలాబ్‌బాబు

➡️