రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు

Mar 29,2024 17:45 #Annamayya district

ప్రజలకు సేవ చేయడమే
మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్

ప్రజాశక్తి – రామసముద్రం : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామసముద్రం తెదేపా మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ నాడు ఎన్టీఆర్ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారని అన్నారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు ప్రకటించారని అన్నారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలి అంటూ.. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని అన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో టీడీపీ నిమగ్నమైందని అన్నారు. తెలుగుదేశం ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుందని తెలిపారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందాలంటే షాజహాన్ బాషాను ఎమ్మెల్యే గా గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాటకొండ బాబు రెడ్డి , మాజీ జడ్పిటిసి శివశంకర్ ,మాజీ అధ్యక్షులు కృష్ణం రాజు, రాజేష్ స్వామి, మాలేనత్తం సుధాకర్ రెడ్డి, త్యాగరాజ, నాగరాజ , రెడ్డి శేఖర్, బందెల శివ ,నారి స్వామి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️