సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
- కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
వేసవిలో జిల్లాలో మంచినీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నామని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. వేసవిలో తాగునీటి సరఫరా, ఉపాధి హామీ, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరాకు ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రానున్న రోజులలో వేడి గాలులు ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉపాధి హామీలో నీటిసంరక్షణ, మంచినీటి చెరువుల డీసిల్టింగ్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఉండరాదని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులను 24 గంటల్లో పరిష్కరిస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన గొట్టాబ్యారేజీలో నీటి నిల్వల గురించి వంశధార అధికారులతో మాట్లాడారు. సమావేశంలో జెడ్పి సిఇఒ డి.వెంకటేశ్వరరావు, ఇపిడిసిఎల్ ఇఇ ఎల్.సి.హెచ్ పాత్రుడు, డిపిఒ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ చిట్టిరాజు, వంశధార ప్రాజెక్టు ఎస్ఇ డోల తిరుమలరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇంజినీర్ పి.సుగుణాకరరావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ జాన్ బెనహర్ తదితరులు పాల్గొన్నారు.