దరఖాస్తుదారులందరికీ కుళాయి కనెక్షన్లు

Feb 4,2024 13:09 #Vizianagaram
pipe connections in vzm

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కులాయి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కనెక్షన్ ఇస్తామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కె.ఎల్.పురం వాటర్ ట్యాంక్ వద్ద ఆదివారం కుళాయి కనెక్షన్ల కోసం డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించారు. కె.ఎల్ పురం, రెవిన్యూ కాలనిలకు చెందిన 70 మంది లబ్ధిదారులు కుళాయి కనెక్షన్ కోసం దరఖాస్తులు సమర్పించారు. స్వయంగా కోలగట్ల లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అందరికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని, పైప్ లైన్లు కూడా వేస్తామని, కంగారు పడవద్దని తెలిపారు. కె.ఎల్ పురం వాసులకు రక్షిత తాగు నీటి సమస్య ఉందని గుర్తించి ఇక్కడ వాటర్ ట్యాంక్ ను నిర్మించామని, ప్రజల అవసరాల్ని తీర్చే ప్రభుత్వమని అన్నారు. విజయనగరం నియోజకవర్గం లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అపార్మెంట్లకు, ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు తీసుకొని కుళాయిలు వేయాలని కార్పొరేటర్, సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంతోషి కుమారి, తాళ్లపూడి రమణ, పబ్లిక్ హెల్త్ డి.ఈ అప్పా రావు, పార్టీ ప్రతినిధులు, కె ఎల్ పురం, కామాక్షి నగర్, రెవిన్యూ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

➡️