పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వాలి

Jan 1,2024 00:40

ప్రజాశక్తి – బాపట్ల
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్‌సి, కరువు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ఎపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు డిమాండ్ చేశారు. స్థానిక కమిషనర్ అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను చిన్నభిన్నం చేసిందన్నారు. రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ భాషా మాట్లాడుతూ జీవో నెంబర్.117ను రద్దు చేయాలన్నారు. ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళుగా ఒక్క ఉపాధ్యాయ పోస్టు నియామకం చేయక పోవడం దారుణమన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పిడి సోషలిజం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి సిపిఎస్ రద్దు చేస్తానన్న జగన్‌ హామీని నిలుపుకోలేకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు వై నేతాంజనేయ ప్రసాద్, ఐ విజయ్ సారథి, ఎంసిహెచ్ రాజరత్నం పాల్గొన్నారు.

➡️