న్యూఢిల్లీ : ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ , ‘అటల్ సేతు’గా పిలిచే ఈ సముద్ర వంతెన ముంబయి, నవీ ముంబయిల మధ్య ప్రయాణానికి పట్టే సమయాన్ని గంటన్నర నుండి సుమారు 20 నిమిషాలకు తగ్గిస్తుంది. ముంబయిలోని సేవ్రీ నుండి రారుగఢ్ జిల్లాలోని నవాశేవాను కలుపుతూ నిర్మించారు. రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన ఆరు లేన్లను కలిగి వుంది. మొత్తం వంతెన పొడవు 21.8 కి.మీ కాగా, 16 కి.మీలకు పైగా అరేబియా సముద్రంపై వుంటుంది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరుమీద నిర్మించిన ఈ వంతెన ట్రాఫిక్ను సులభతరం చేయడం, రవాణాను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి ఇంజిన్గా కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించినట్లు వెల్లడించారు.