కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన ఉద్దేశాలు- చత్తీస్‌గఢ్‌ సభలో ప్రధాని మోడీ

Apr 24,2024 23:58 #PM Modi, #speech

అంబికాపూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) : ప్రజల ఆస్థులు, హక్కులు హరించాలని కాంగ్రెస్‌కు ‘ప్రమాదకరమైన ఉద్దేశాలు’ ఉన్నాయని, పిట్రోడా వ్యాఖ్యలతో ఇవి బయటకు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అంబికాపూర్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్‌ నాయకుడు శ్యామ్‌ పిట్రోడా ‘వారసత్వ పన్ను’ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ వారి నుంచి ‘వారసత్వపు పన్ను’ ఆలోచన బయటకు వచ్చిందని అన్నారు. రాహుల్‌ గాంధీ సలహాదారే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారని అన్నారు. ‘మీరు బతికిఉన్నంత వరకూ పన్నులతో వేధించే కాంగ్రెస్‌, మీ జీవితం ముగిసిన తరువాత కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. వారసత్వ పన్ను విధించి మీ ఆస్థులను, మీ పిల్లల హక్కులను లాక్కోవాలనుకుంటుంది’ అని మోడీ అన్నారు. ‘సామాన్య భారతీయులు వారి ఆస్థులను వారి పిల్లలకు ఇవ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు’ అని మోడీ చెప్పారు. ‘వారి నుంచి నిన్ననే ఈ ప్రకటన వచ్చినా.. వారికి ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది’ అని మోడీ ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ దృష్టి మీ రిజర్వేషన్‌పైనే కాదు, మీ సంపాదన, మీ ఇళ్లు, దుకాణాలు, భూములపై కూడా ఉంది. ప్రతి ఒక్కరి ఆస్తులపై ఎక్స్‌రే నిర్వహిస్తామని కాంగ్రెస్‌కు చెందిన ‘షెహజాదా’ (రాహుల్‌ గాంధీని ఉద్దేశించి) చెప్పారు. మన తల్లులు, సోదరీమణులు కలిగి ఉన్న ఇల్లు, అల్మారాతో పాటు దేశంలోని ప్రతి కుటుంబాన్ని కాంగ్రెస్‌ పరిశీలిస్తుంది, మా ఆదివాసీలు గిరిజనులు ఆభరణాలను ధరిస్తారు. వారి నుంచి మంగళసూత్రం కూడా కాంగ్రెస్‌ నాయకులు లాగేసుకుంటారు’ అని మోడీ అన్నారు.

➡️