ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోంది : రాహుల్‌

రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు యాత్ర రాంచీకి చేరుకుంది. సోమవారం రాంచీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోడీ ప్రభుత్వం నెమ్మదిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేస్తోంది. హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఇసి) పనిచేయకూడదని కేంద్రప్రభుత్వం కోరుకుంటోంది. రాబోయే రోజుల్లో హెచ్‌ఇసి పేరు స్థానంలో అదానీ నేమ్‌ ప్లేట్‌ను పెడతారు. దాన్ని ప్రయివేటీకరించాలనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా పిఎస్‌యుకి చెందిన వ్యక్తులు పోస్టర్లు చేతుల్లో పట్టుకుని నిలబడడం చూస్తున్నాను. బిహెచ్‌ఇఎల్‌, హెచ్‌ఏఎల్‌, లేదా హెచ్‌ఇసి అన్నీ నమ్మెదిగా అదానీకి అప్పగించబడుతున్నాయి. అయితే ఇలాంటి వాటికి కాంగ్రెస్‌ ఎప్పటికీ అనుమతించదు. మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి. అయితే హెచ్‌ఇసి పేరుకి బదులు అదానీ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్‌ అనుమతించదు. ఇది దేశ రాజధాని. ఇది ఏ పారిశ్రామికవేత్త రాజధాని కాదు. అదానీకి ఇలాంటి ఉచిత బహుమతులు లభించవు.’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన చంపాయి సోరెన్‌ ప్రభుత్వానికి రాహుల్‌ అభినందనలు తెలిపారు.

➡️