హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ … తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.
మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకపూట తరగతులు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒక పూట భోజనం పెట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. అయితే 10వ తరగతి కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పాఠశాలల్లో ముందుగా మధ్యాహ్న భోజనం అందించి ఆ తర్వాత తరగతులు కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యథావిధిగా ఉదయం తరగతులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేస్తామని విద్యాశాఖ తెలిపింది.