వ్యవసాయశాఖ అధికారి భవాని
ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ : బాపులపాడు మండలంలో తుఫాన్ ధాటికి నష్టపోయిన రైతుల వివరాలతో పాటు విస్తీర్ణం తదితర వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరిగిందని రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి భవాని తెలిపారు. కానుమోలు, రంగయ్యప్పారావుపేట, ఆరుగొలను, తదితర గ్రామాల్లో నీటమునిగిన పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తడిసిన పనలపై ఉప్పు ద్రావణం పిచికారి చేయాలని సూచిస్తూ, వరిపొలంలోని నీటిని బయటకు తీసివేయడానికి, పడిపోయిన వరిపైరు కట్టలు కట్టేందుకు, ఉప్పనీటి ద్రావణం పిచికారి చేసేందుకు ఎన్ఆర్ఎఎస్ లోని కార్మికులను ఉపయోగించుకునేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని రైతులకు వివరించారు. బాపులపాడు మండలంలో ఇప్పటి వరకు 3473 ఎకరాల్లోని వరిపంట కోయకుండా మునిగిపోగా, 5313 ఎకరాల్లోని వరిపంట వాలిపోయిందని, 400 ఎకరాల్లోని మొక్కజొన్న వాలిపోయిందని పంటనష్టం అంచనాలు రూపొందించడం జరిగిందన్నారు. పంటనష్టం అంచనాలు రూపొందించేందుకు సమీపంలోని ఆర్బీకేల్లో సంప్రదించాలని రైతులకు ఏఓ భవాని సూచించారు.