నామినేషన్ల జోష్చిత్తూరు జిల్లాలో 1+8తిరుపతి జిల్లాలో 3+17ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఇండియా వేదిక అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి నామినేషన్ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, విసికె పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. బైరాగిపట్టెడ పార్కు నుంచి ఎయిర్బైపాస్, అన్నమయ్య కూడలి వరకూ ప్రదర్శన సాగింది. ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, తిరుపతి, చిత్తూరు కళాకారులు గుర్రప్ప, నాగరాజు, కాళయ్య, సూరి ఆలపించిన విప్లవగేయాలు, ఆటపాట ఆకట్టుకుంది. వాయిద్యాల నడుమ, బాణసంచా పేల్చుతూ ప్రదర్శన చూడటానికి నగరవాసులకు రెండు కళ్లు చాలలేదు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాగంటి గోపాల్రెడ్డి మాట్లాడుతూ కష్టజీవుల తలలో నాలుకగా ఉంటూ, నిత్యం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసే పి.మురళిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కనీసం తిరుపతి వీధుల గురించి తెలియనివారు కావాలో, శ్రమజీవుల పక్షాన నిలబడే ఇండియా కూటమి అభ్యర్థి మురళి కావాలో తిరుపతివాసులే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన, వైసిపి ఏ పార్టీకి ఓటు వేసినా మోడీకి వేసినట్లేనన్నారు. అనంతరం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదితిసింగ్కు నామినేషన్పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకష్ణ, రామచంద్రయ్య, సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, నాయకులు కందారపు మురళి, నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జయచంద్ర, మాధవ్, సాయి లక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.తిరుపతి ఎంపి బిఎస్పి అభ్యర్థిగా రిటైర్డ్ జడ్జి గుర్రప్ప తిరుపతి పార్లమెంటు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అభ్యర్థిగా రిట్కెర్డ్ జడ్జి, ఆ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ పెనుమూరు గురప్ప శనివారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు బిఎస్పి తిరుపతి జిల్లా అధ్యక్షులు పేరాల జయచంద్ర, తిరుపతి అసెంబ్లీ అధ్యక్షులు కె.వెంకటేష్, సీనియర్ జర్నలిస్టు ఎం.నాగరాజ, మహేష్ వున్నారు. నామినేషన్ దాఖలు చేయానికి బయలుదేరే ముందు ఇంట్లో జ్యోతిబాపూలే, అంబేద్కర్, కాన్షీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1989లోనూ తిరుపతి లోక్సభ స్థానం నుంచి బిఎస్పి అభ్యర్థిగా పోటీ చేశానని గుర్తు చేశారు. విబేధాలు వీడి బావతో వచ్చిన ఎస్ఎస్ఆర్ శ్రీకాళహస్తిలో.. అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి బియ్యపు మధుసూదన్రెడ్డి జననీరాజనాల నడుమ శనివారం నామినేషన్ను అట్టహాసంగా వేశారు. ముందుగా శ్రీరామనగర్ కాలనీలోని విజయ గణపతి ఆలయం నుంచి బీపీ అగ్రహారం వరకూ అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులును వెనక కూర్చోబెట్టుకుని తానే స్వయంగా స్కూటీని నడుపుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. బియ్యపు మధుసూదన్రెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ ఎడమొహం పెడమొహంగా ఉన్న ఆయన బామ్మర్ది సామాను శ్రీధర్రెడ్డి తన అక్క బియ్యపు శ్రీవాణిరెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి విచ్చేశారు. శ్రీవాణిరెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. ఇన్నాళ్లూ మధుసూదన్రెడ్డికి, సామాను శ్రీధర్రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. ఎంతైనా బావ బామ్మర్దులు కదా, నామినేషన్ల సందర్భంగా అలా కలిసిపోయారన్నమాట.