ప్రజాశక్తి-ఇందుకూరుపేట(నెల్లూరు) : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదో రోజు ఇందుకూరుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులు పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో గొడ్డు చాకిరి చేస్తున్న అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని రోడ్డెక్కారన్న విషయం ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని అన్నారు. తెలంగాణ కన్నా జీతం పెంచి ఇస్తామన్న జగనన్న హామీని అమలు చేయకుండా దగా చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఈ ప్రభుత్వం దుర్మార్గమైన పద్ధతులను అవలంబిస్తోందని అన్నారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు అంటున్నట్లు అంగన్వాడీలు ఒళ్ళు బలిసి బయటకు రాలేదని, కడుపు కాలి బయటకు వచ్చారన్న విషయం విస్మరించిన ఈ ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల తాళాలు పగులగొట్టి సరుకులను దొంగతనంగా సచివాలయాలకు తరలించడం హేయమైన అని విమర్శించారు. అనంతరం ఇందుకూరుపేట MROకి వినతిపత్రం అందజేశారు.