ఇస్లామాబాద్ : ఉత్తర పాకిస్థాన్లో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఇద్దరు సైనికులు సహా తొమ్మిది మంది మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 26 మంది గాయపడగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉత్తర గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి అజ్మత్ షా పేర్కొన్నారు. బస్సు గిల్గిట్ నుండి రావల్పిండికి ప్రయాణికులతో వెళుతోంది. అదే సమయంలో కాల్పులు జరపడంతో .. బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. ట్రక్కు మంటలు చెలరేగడంతో రెండు వాహనాల డ్రైవర్లు మరణించారు. ఇది ‘ఉగ్రవాద చర్య’ అని గిల్గిత్ బాల్టిస్తాన్ హోం మంత్రి షామ్స్లోన్ పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్కు చెందిన ఇద్దరు సైనికులు కూడా ఉన్నారని అన్నారు. స్థానిక ఇస్లామిక్ మత గురువు ముఫ్తీ షేర్ జమాన్ కూడా గాయపడ్డారని చెప్పారు.