న్యూయార్క్ (అమెరికా) : శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతమంతా వణికిపోయింది. కొండ ప్రాంతాల్లో ఉంటున్నవారు భయాందోళన చెందారు. దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారిగా వచ్చిన ఈ భూకంపం సుమారు 4.2 కోట్ల మందిని ఉలిక్కిపడేలా చేసింది. మన్హట్టన్, బ్రూక్లిన్లతోపాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది.
అప్రమత్తమైన అధికారులు…
అమెరికా కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10.23 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూభౌతిక పరిశోధన సంస్థ (యూఎస్జీఎస్) తెలిపింది. న్యూ జెర్సీలోని వైట్హౌస్ స్టేషన్కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని చెప్పడంతో …. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు. అత్యంత రద్దీగా ఉండే ఆమ్ట్రాక్ రైల్వే వ్యవస్థ తమ రైళ్ల వేగాన్ని తగ్గించింది. అధికారులు వంతెనలు, ఇతర ప్రధాన మౌలిక వసతులను తనిఖీ చేశారు.
ప్రకంపనలతో ఐరాస దౌత్యవేత్తల సమావేశానికి ఆటంకం…
గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు ఐరాస దౌత్యవేత్తలు శుక్రవారం సమావేశమయ్యారు. అదే సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. వెంటనే భూకంపానికి సంబంధించిన అప్రమత్తత సందేశాలతో ఆ మందిరంలో ఉన్నవారి ఫోన్లన్నీ మోగడంతో సమావేశానికి స్వల్ప ఆటంకం కలిగింది.