ముంబయి : ప్రధాని మోడీ హయాంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణ తీరుపై మహారాష్ట్రకు చెందిన శివసేన (యుటిబి) నేత, ఎంపి సంజయ్ రౌత్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఫైవ్ స్టార్ జైలుగా అభివర్ణించారు. పార్లమెంట్ పని తీరు తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. ‘ఢిల్లీలోని సెంట్రల్ విస్తా పరిస్థితిని ప్రతి ఒక్కరూ చూడాలని, నూతన పార్లమెంట్ పని చేయలేని ఫైవ్ స్టార్ జైలు లాంటిది’ అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా ఫోరం ‘ కేంద్రంలో అధికారంలోకి వస్తే పార్లమెంట్ సమావేశాలను చారిత్రాత్మకమైన పాత పార్లమెంటు భవనానికి తరలించే అవకాశం ఉందని అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, చారిత్రాత్మక పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.