రఫాపై దాడికి తేదీ ఖరారు చేశాం : నెతన్యాహు

The real terrorist is Netanyahu!
  •  చర్చల పునరుద్ధరణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్న హమాస్‌
  •  గాజాకు అంతర్జాతీయ జర్నలిస్టులు వెళ్లాలి : ఐరాస

గాజా : దక్షిణ గాజాలోని రఫా నగరంపై పదాతిదళంతో దాడికి తేదీని ఖరారు చేశామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజామిన్‌నెతన్యాహు చెప్పారు. ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగిన నేపథ్యంలో నెతన్యాహు ప్రకటన వెలువడింది. రఫా నగరంలో దాదాపు 14లక్షలమంది నిర్వాసితులైన ప్రజలు తలదాచుకున్నారు. రాఫాపై దాడికి సిద్ధమవడం కోసమే తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రక్షణ అధికారులు తెలిపారు. దీనిపై హమాస్‌ ప్రతినిధి సమీ అబూ జహ్రీ స్పందిస్తూ కైరోలో కాల్పుల విరమణ కోరుతూ చర్చలను పునరుద్ధరించడంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈజిప్ట్‌లో మధ్యవర్తులు అందజేసిన తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనపై సమీక్షిస్తున్నామని తొలుత హమాస్‌ తెలిపింది. గాజా నగరంలోని జీటూన్‌ ప్రాంతంలో గత 24గంటల్లో ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు బాంబు దాడులకు దిగడంతో 153మంది చనిపోయారు. తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ స్పందిస్తూ కాల్పుల విరమణపై హమాస్‌కు ఒక ప్రతిపాదన అందజేశామని, ప్రస్తుతం హమాస్‌ కోర్టులో బంతి వుందని, ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి వుందని వ్యాఖ్యానించారు.
గాజాలో నెలకొన్న సంక్షోభానికి మరింత ఆజ్యం పోసేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని, అందువల్ల అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు వీలుగా అంతర్జాతీయ జర్నలిస్టులను అక్కడకు పంపించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

➡️