- వెలుగులోకి రాని ప్రజాసమస్యలు
- రైతు ఉద్యమ కవరేజే నిదర్శనం
- నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదాన సభలో పాలగుమ్మి సాయినాథ్
ప్రజాశక్తి- గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి జాతీయ, కార్పొరేట్ మీడియా సంస్థలు దాసోహం అంటున్నాయని ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. గుంటూరులోని కొరటాల భవన్లో అంబేద్కర్, జాషువా, ఫూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని ఆదివారం రాత్రి పాలగుమ్మి సాయినాథ్కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఫౌండేషన్ అధ్యక్షులు బి.విల్సన్ అధ్యక్షత వహించారు. సాయినాథ్ మాట్లాడుతూ వివిధ కారణాలతో మీడియా సంస్థలు మోడీ సర్కారుకు లొంగిపోవడంతో ప్రజా సమస్యలు వెలుగులోకి రావడం లేదని అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి జాతీయ మీడియా ఇస్తున్న కవరేజే దానికి నిదర్శమన్నారు. ఒక్క జాతీయ పత్రికలో కూడా కనీసం ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఎడిటోరియల్ రాలేదని అన్నారు. రైతులపై కేంద్ర బలగాలు కనీవినీ ఎరుగని రీతిలో దాడులకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. అన్నదాతలపై ప్రభుత్వం డ్రోన్లు, వైమానిక దాడులు చేయడం అత్యంత పాశవికమని తెలిపారు. ఇతర దేశాల టెర్రరిస్టులపై ప్రయోగించాల్సిన డ్రోన్లు, వైమానిక దాడులు మన దేశ రైతులపై ప్రయోగిస్తున్నారని అయినా కార్పొరేట్ మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పాశవికమైన దమనకాండకు పాల్పడుతోందని, హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తోన్న తీరు సరికాదన్నారు. దేశంలో పత్రికా వ్యవస్థ అంబానీ గుప్పిట్లోకి వెళ్లి పోయిందన్నారు. ప్రస్తుత కేంద్ర పాలకులు సమాజాన్ని మత, కుల పరంగా విభజిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టులో చాలాకాలం తరువాత మంచి తీర్పు వచ్చిందంటూ ఎలక్ట్రోరల్ బాండ్ల రద్దు తీర్పును ప్రస్తావించారు. అయితే, తీర్పులో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ప్రతిపక్షాలకు ఎవరి నుంచీ విరాళాలు అందకుండా కట్టడి చేయడంలో భాగంగానే ఎలక్ట్రోరల్ బాండ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. గత ఐదేళ్లలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో కేంద్రానికి అనుకూలంగా ఉన్నవే ఎక్కువగా వస్తున్నాయని, దీంతో, వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో కేంద్రం కోర్టులో అనేక తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిందన్నారు. కరోనా వల్ల 2022 మార్చి నాటికి 5.22 లక్షల మంది మాత్రమే చనిపోయారని ప్రధాని మోడీ ప్రకటించగా, ఇంతకంటే పది రెట్లు ఎక్కువగా మరణాలు సంభవించారని అంతర్జాతీయ జర్నల్స్, డబ్ల్యుహెచ్ఒ వెల్లడించాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాశీ, సరయూ నదుల్లో వేలాది మంది మృతదేహాలు కొట్టుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. దైనిక్ భాస్కర్ పత్రిక వాస్తవాలు ప్రచురిస్తే, వెంటనే ఆ పత్రికపై ఇడి, సిబిఐ, ఇన్కంట్యాక్సు దాడులు జరిగాయని తెలిపారు. అనంతరం సుప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని పి.సాయినాథ్కు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, బిసికె పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు జయసుధ, ఎండి అక్బర్బాబు, ప్రముఖ గాంధేయవాది అనిల్ నౌరియా తదితరులు పాల్గొన్నారు.