నర్సాపూర్ (నిర్మల్ ) : నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి విదితమే. వీరు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన మౌనిక, వినంతి, ఆరాధ్యలను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నారని అక్కడి డాక్టర్లు తెలిపారు. ఈ పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాంక్ పై కవర్ లేకపోవడంతో వెంటనే బిగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మిషన్ భగీరథ ట్యాంకు వద్దకు వెళ్లి నీటిని పరిశీలించారు. విద్యార్థులు తాగుతున్న మినరల్ వాటర్, వంటకు ఉపయోగించే బోర్ వాటర్ శాంపిల్స్ సేకరించారు. మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వీణలను ఆదేశించారు.