పీలేరులో పోలీసుల అత్యుత్సాహం

  • నారా భువనేశ్వరి కాన్వాయ్ అడ్డగింత
  • పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య వాగ్వివాదం

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : పీలేరులో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కాన్వాయ్ను అడ్డుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడుకు వెళుతున్నభువనేశ్వరికి బుధవారం పీలేరులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు దుశ్యాలువలు, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె అందరికీ అభివాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పీలేరు నుంచి గాలివీడుకు బయలుదేరిన కాన్వాయ్లో 5వ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుమారు అరగంటకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు మీడియా వాహనాన్ని సైతం అడ్డుకోవడంతో మీడియా ప్రతినిధులు, ఇతర వాహనదారులు తమ అస్సహనాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వరికి స్వాగతం పలికిన వారిలో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి తో పాటు తిమ్మాపురం రఘునాథరెడ్డి, వారణాసి శ్రీకాంత్‌ రెడ్డి, కోటపల్లి బాబు రెడ్డి, పురం రామ్మూర్తి, పసుపులేటి లక్ష్మీకర్‌, పోలిశెట్టి సురేంద్ర, అమర్నాథరెడ్డి, మహేష్‌ గుప్త, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️