నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన.. భవన యాజమాని అరెస్ట్‌

Nov 19,2023 15:15 #Fire Accident

నాంపల్లి : ఈ నెల 13 వ తేదీన నాంపల్లి లోని బజార్‌ఘాట్‌ లోని బాలాజీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే.. ఈ ప్రమాదంలో మఅతుల సంఖ్య 10 కి చేరింది. కాగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భవనం యజమానిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే.. బజార్‌ఘాట్‌ లోని బాలాజీ రెసిడెన్సీ యజమాని రమేష్‌ గత కొంత కాలంగా అక్రమంగా కెమికల్స్‌ ను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలుసార్లు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన తన పంథా మాత్రం మార్చుకోలేదు. నాలుగు అంతస్తుల భవనం లోని స్టిల్ట్‌ ఫ్లోర్‌లో కెమికల్‌ డ్రమ్ములు ఉంచాడు. ఈ నేపధ్యంలో దీపావళి రోజు చిన్న నిప్పురవ్వ తో మొదలైన మంటలు ఆ కెమికల్‌ డ్రమ్ములకు అంటుకోవడం వల్లనే ఈ ఘోరం జరిగింది. దీనితో రమేష్‌ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.
కాగా ఈ ఘటన గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు గతంలో చాల సార్లు రెసిన్‌ డ్రమ్ములు అలానే డబ్బాలను అక్రమంగా స్టిల్ట్‌లో నిల్వ చేస్తూ పట్టుబడ్డాడని.. ఎన్ని సార్లు చెప్పిన తన పంథా మార్చుకోలేదని.. ఇప్పుడు ఈ ప్రమాదానికి అతనే కారణమని పేర్కొన్నారు. నవంబర్‌ 11 సాయంత్రం నిందితుడు 35 కిలోల రెసిన్‌ ఉన్న 32 డబ్బాలను కొనుగోలు చేసాడని.. ఆ రెసిన్‌ కెమికల్‌ ఉన్న డబ్బాలను స్టిల్ట్‌ ఫ్లోర్‌లో నిల్వ చేసాడని.. కాగా నవంబర్‌ 13 వ తేదీన పిల్లలు బాణాసంచా కలుస్తున్న సమయంలో నిప్పురవ్వలు నిందితుడు ఉంచిన రెసిన్‌ డబ్బాలను తాకడం వల్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీనితో నిందితుడిని అరెస్ట్‌ చేసి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఐపిసి సెక్షన్‌ 304 , 285 (అగ్ని లేదా మండే పదార్థాలకు సంబంధించి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), 286 (పేలుడు పదార్ధానికి సంబంధించి నిర్లక్ష్య ప్రవర్తన), సెక్షన్‌ 9 (1) (b) పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

➡️