ఢిల్లీ : జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రారంభించింది. నీట్ రాయాలనుకుంటున్న అభ్యర్థులు https://neet.ntaonline.in/ వెబ్ సైట్ను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది నీట్ పరీక్ష మే 5న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. జూన్ 14న నీట్ ఫలితాలు వెల్లడించనున్నారు.
నీట్ (యూజీ)-2024 పరీక్ష రిజిస్ట్రేషన్లకు మార్చి 9వ తేదీ చివరి రోజు. దరఖాస్తుదారులు క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును మార్చి 9వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు. జనరల్ కేటగిరీ, ఎన్నారై అభ్యర్థులు నీట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,700 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీల్ అభ్యర్థులు రూ.1,600… ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పిదాల సవరణకు, హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ కు తేదీలను వెబ్ సైట్ ద్వారా త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీయే వెల్లడించింది.