పారిశుధ్య కార్మికులకు మున్సిపల్‌ కమిషనర్‌ సూచనలు

ప్రజాశక్తి-హిందూపురం (అనంతపురం) : పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో సురక్షిత ప్రమాణాలు పాటిస్తూ బాధ్యత గా విధులు నిర్వర్తించాలని కార్మికులకు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి సూచించారు. మంగళవారం ఉదయం వివిధ డివిజన్‌ లలో కార్మికుల మాస్టర్‌ ను ఆకస్మికంగా కమిషనర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్‌వారిగా ఎంతమంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు, ఇందులో పర్మినెంట్‌ కార్మికులు ఎంతమంది, కాంట్రాక్ట్‌ పద్ధతిని ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది మేస్త్రీలు ఉన్నారు, తదితర విషయాలను శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ శంకర్‌ తో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ కార్మికులతో మాట్లాడుతూ … విధుల్లో పాల్గొనేటప్పుడు ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. బూట్లు, గ్లౌజ్‌ లు తదితర రక్షణ వస్తువులను వాడాలన్నారు. ప్రధానంగా పురపాలక పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వేకువజామునే విధులకు హాజరు కావాలన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో విధులు కచ్చితంగా నిర్వహించాలన్నారు. పట్టణ సుందరీకరణ, పారిశుధ్యం మెరుగులో శానిటేషన్‌ కార్యదర్శులు కార్మికులను సమన్వయం చేసుకుని పనులు చేయించాలన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శానిటేషన్‌ కార్యదర్శులు పారిశుధ్య పర్యవేక్షణ విధులకు గైర్హాజరైతే నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సంబంధిత శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ శంకర్‌ను ఆదేశించారు. పట్టణ సుందరీకరణ, పారిశుద్ద్యం మెరుగు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు. అనంతరం పారిశుధ్య పర్యవేక్షణ లో భాగంగా పట్టణంలో వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్‌ పెక్టర్‌ శంకర్‌, సచివాలయం పారిశుధ్య కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️