న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) భారత్లో సుమారు 2 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య మొత్తం 2,12,627 ఖాతాలను తొలగించినట్లు ఎక్స్ ప్రకటించింది. వీటిలో చిన్నారులపై లైంగిక వేధింపులను, నగ దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది. సంస్థ తన నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘భారత్లోని యూజర్ల నుంచి 5,158 ఫిర్యాదులను స్వీకరించాం. వాటిలో 86 ఫిర్యాదుల్ని ప్రాసెస్ చేశాం. పరిశీలన అనంతరం వాటిలో 7 అకౌంట్లను రద్దు చేశాం” అని ‘ఎక్స్’ తెలిపింది. భారత్ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో వేధింపులు (3,074), ద్వేషపూరిత ప్రవర్తన (412), అడల్ట్ కంటెంట్ (953) వేధింపులు (359).. వంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న 1,235 ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. అలాగే, ఈ ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 మధ్య 5,06,173 ఖాతాలను ఎక్స్ తొలగించిన విషయం తెలిసిందే. వీటిలో 1,982 ఖాతాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని తెలిపింది.