ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : వైసిపి రేపల్లె ఇన్ఛార్జిగా మోపిదేవి వెంకటరమణను నియమించాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్రోడ్డులోని ఓ హోటల్లో సోమవారం వివిధ జిల్లాల మత్స్యకార సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేష్ట కార్పొరేషన్ డైరెక్టర్ (హిందూపురం) బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు రూ.40 లక్షల ఓటింగ్ కలిగి ఉన్నారని, ఓటింగ్ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా 20 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రేపల్లె ఇన్ఛార్జిగా మోపిదేవి ప్రాముఖ్యత ఇవ్వాలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించవద్దని తీర్మానించారు. కొత్త వారికి నామినేటెడ్ పదవులిచ్చి వారికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికంగా, విద్యపరంగా, రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించాలన్నారు. మోపిదేవిని ఇన్ఛార్జిగా నియమించకపోవడం మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే జెఎసిగా ఏర్పడతామన్నారు.