న్యూఢిల్లీ : మూడు దశాబ్దాల తరువాత భారతదేశం వేదికగా… ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 9 వరకు 71వ ‘ప్రపంచ సుందరి పోటీలు’ జరగనున్నాయి. భారత్లో చివరిసారిగా 1996లో ఈ పోటీలను నిర్వహించారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటిడిసి) ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన ఢిల్లీలో ‘ది ఓపెనింగ్ సెర్మనీ’, ‘ఇండియా వెల్కమ్స్ ది వరల్డ్ గాలా’ కార్యక్రమాలతో ఈ ప్రదర్శన ప్రారంభంకానుంది. మార్చి 9న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫైనల్స్ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు ఈ పోటీలో పాల్గననున్నారు. ప్రస్తుత ప్రపంచ సుందరి పోలెండ్కు చెందిన కరోలినా బిలాస్కాతో పాటు మాజీ విజేతలు తోని అన్ సింగ్ (జమైకా), వనెస్సా పోన్సీ డి లియోన్ (మెక్సికో), మానుషీ చిల్లర్ (భారత్), స్టిఫేనీ డెల్ వాలీ (ప్యూర్టో రికో)లు విలేకరుల సమావేశంలో హాజరై ప్రకటన చేశారు.