ప్రజశక్తి – చీరాల
ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్ధుల్లో మానసిక వికాసం పెరుగుతుందని ఎంఎల్ఎ కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థాయిన సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు క్రమశిక్షతో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రోత్సహించటం అభినందనీయమని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కార్నివాల్ సభకు ఎస్పి వకుల్ జిందాలత్తో కలిసి ఆయన మాట్లాడారు. స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ ఎల్లా ట్రెస్సా, ప్రిన్సిపాల్ జీనా క్సవిర్ విద్యార్థులతో ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు పయనించేలా చేస్తూ వారిని ఎన్సిసి, స్పోర్ట్స్, అన్ని రంగాల్లో తీర్చి దిద్దుతున్న పాఠశాల యాజమాన్య సేవలు హర్షనీయమని అన్నారు. దేశభక్తిని చాటుతూ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల విన్యాసాలు ఎంతగానో అలరించాయని అన్నారు. తొలుత శాంతికి చిహ్నంగా పావురాలను స్వేచ్ఛగా గాలిలోకి వదులుతూ స్పోర్ట్స్ కార్నివాల్ ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన పాటలు, సాంస్కృతిక నృత్యాలు, స్కిట్లు అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, డిఇఓ రామారావు, ఎంఇఓ సుబ్రమణ్యం, వైసిపి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సల్లూరీ అనిల్, కౌన్సిలర్ బత్తుల అనిల్, కంపా అరుణ్, గొట్టిపాటి ఎబినేజరు, జేసీఎస్ పట్టణ ఇంచార్జీ కోలా శివ, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.