ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆరిలోవ ప్రాంతంలో స్వయంగా చీపురు పెట్టి పలు ప్రాంతాలను శనివారం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్న నగరంలో వ్యర్ధాలు పేరుకు పోతున్నాయని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వ పర్మినెంట్ పారిశుధ్య కార్మికులతో కలిసి ఆరిలోవ ప్రాంతంలో పలు ప్రాంతాలను శుభ్రం చేశామని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తారని, వారితో చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకు పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరై నగర పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ కార్మికులు సమ్మెలో ఉన్నందున నగర ప్రజలు జీవీఎంసీ చేస్తున్న ప్రయత్నానికి సహకరించి తమ వ్యర్ధాలను జీవీఎంసీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లోనే వేయాలని, చెత్తను విచ్చలవిడిగా పడవేయరాదని విజ్ఞప్తి చేశారు. పర్మెంటు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆరిలోవ ప్రాంతంలో పలు వార్డులను శనివారం శుభ్రం చేయడం జరిగిందని మేయర్ తెలిపారు.