లక్నో : 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఆకాష్ ఆనంద్ మాయావతి తమ్ముడి కుమారుడు. 2019లో ఆకాష్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం కూడా చేపట్టారు. అదే సమయంలో ఆయనను బిఎస్పి జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. గతేడాది నుండి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు.
2016లో బిఎస్పిలో చేరిన ఆకాష్ మాయావతి తర్వాత పార్టీలో అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2022లో రాజస్థాన్లోని అజ్మేర్లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతోపాటు, ఇటీవల డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్ యాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఆకాష్కు అప్పగించారని బిఎస్పి నేత ఉదయవీర్ పేర్కొన్నారు. మాయావతి తర్వాత ఆకాష్ను రాజకీయ వారసుడిగా ప్రకటించారని అన్నారు.