ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : గడిచిన 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నఎగ్జిబిషన్ ఈ ఏడాది కూడా విశాఖ వాసులను అలరించడానికి సిద్ధం అయింది. కనుమ పండుగను పురస్కరించుకుని మంగళవారం నుండి మెరైన్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి ఎగ్జిబిషన్ ను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన భారీ చేప ఆకృతి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుందని అన్నారు. అంతే కాకుండా ఈసారి థీమ్ గా మెరైన్ పార్క్ ను ఎంచుకున్నామని, పూర్తి సెంట్రల్ ఏసీ కలిగిన ఈ మెరైన్ పార్కులో 150 రకాలకు చెందిన 60 వేల చేపలను ప్రదర్శనకు ఉంచుతున్నామని ఆయన తెలిపారు. ఈ చేపలు సముద్రపు లోతుల్లో పదివేల అడుగుల కిందన మాత్రమే కనపడతాయని వీటిని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఇక్కడకు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం పెంపుడు జంతువుల శిక్షకుడు సురేష్ మాట్లాడుతూ ఈ మెరైన్ ఎగ్జిబిషన్ లో చేపలతో పాటు సుమారు 130 రకాల పక్షులతో బర్డ్ షో నిర్వహిస్తున్నామని ఈ పక్షులన్నీ విదేశాల నుంచి తీసుకురావడం జరిగిందని వీటిలో నాలుగు రకాల మకావోలు, ఆస్ట్రిచ్ లతోపాటు ఒక తెల్ల పాము, ఒక కొండ చిలువను ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు. వీటితోపాటు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామని అంతర్జాతీయ స్థాయిలో ఎమ్యుజ్మేంట్ పార్కు కూడా అందుబాటులో ఉంచమని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని ఏడాది లాగే ఈ ఆడది కూడా తమను ఆదరించాలని నిర్వాహకులు కోరారు.