ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి : ముగ్గురు జవాన్లు మృతి

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బిజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. టేకులగూడెం అడవుల వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుందర్‌రాజ్‌ మీడియాకు తెలిపారు. టేకులగూడెంలో సోమవారమే సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కొత్తగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం సిఆర్‌పిఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కోబ్రా (కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిజల్యూట్‌ యాక్షన్‌), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, జిల్లా రిజర్వ్‌ గార్డ్‌కు సంబంధించిన సిబ్బంది సంయుక్తంగా జోనగూడ-అలిగూడా గ్రామాల్లో తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని ఆయన వివరించారు. ఈ ఘటనలో ఇద్దరు కోబ్రా 201 బెటాలియన్‌కు, మరొకరు సిఆర్‌పిఎఫ్‌ 150వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు మరణించారని తెలిపారు. గాయపడిన జవాన్లను ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. దాడి చేసిన తరువాత మావోయిస్టులు పారిపోయారని తెలిపారు. టేకులగూడెంలో 2021 ఏప్రిల్‌లో మావోయిస్టుల దాడిలో 23 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

➡️