మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన

Feb 13,2024 17:44 #New Movies Updates

మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్‌ రాహుల్‌ సదాశివన్‌ రచన మరియు దర్శకత్వంలో నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర డ ఎస్‌.శశికాంత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హారర్‌-థ్రిల్లర్‌ జానర్‌ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌.. వైనాట్‌ స్టూడియోస్‌ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘భ్రమయుగం’ కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా 2024, ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట మేకర్స్‌ భావించారు. అయితే మాతృక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్‌ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్‌ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా షెహనాద్‌ జలాల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా జోతిష్‌ శంకర్‌, ఎడిటర్‌గా షఫీక్‌ మహమ్మద్‌ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్‌, మాటల రచయితగా టి.డి.రామకృష్ణన్‌ వ్యవహరించారు. మేకప్‌ బాధ్యతలు రోనెక్స్‌ జేవియర్‌, కాస్ట్యూమ్స్‌ బాధ్యతలు మెల్వీ జె నిర్వహించారు.

➡️