- మోడీని అవమానించినందుకు చర్య
మాలే : సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి మరియం షియునా సహా ముగ్గురు మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోడీ తన లక్షద్వీప్ పర్యటన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో షియునా కామెంట్ చేశారు. మాల్దీవులు యువజన సంక్షేమ శాఖ సహాయ మంత్రులు మల్షా షరీఫ్, అబ్దుల్లా మహసూమ్ మజీద్లపై చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మాల్దీవు లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొందరు సినీ ప్రముఖులు లక్షదీవులకు సంఘీభావం ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారు. తమ దేశాన్ని భారత్ లక్ష్యంగా చేసుకున్నదని, తమ పర్యాటక రంగంతో పోటీ పడే విషయంలో లక్షద్వీప్ సవాళ్లు ఎదుర్కొంటోందని, అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే మోడీ పర్యటించారని మాల్దీవులు మంత్రి అబ్దుల్లా మహ్సూమ్ మజీద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షరు కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎందుకు సహించాలని ప్రశ్నించారు. ప్రముఖ నటులు జాన్ అబ్రహం, శ్రద్ధకపూర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తదితరులు లక్షదీవుల ఆతిథ్యాన్ని, సముద్ర జీవనాన్ని కొనియాడారు. గత సంవత్సరం నవంబరులో మాల్దీవులు అధ్యక్షుడుగా మహమ్మద్ ముయిజూ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.