ప్రజాశక్తి-అమరావతి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జీవో నెం.2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. అంగన్వాడీల ఉద్యమానికి టిడిపి పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. జగన్ అహంకారానికి, అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అంతిమంగా ఉద్యోగులే విజయం సాధిస్తారని అన్నారు.
జీవో 2ను ఉపసంహరించుకోవాలి : టిఎన్యుఎస్
అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం విరమించికోవాలని తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం( టిఎన్యుఎస్) ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష్య ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయాలని అంగన్వాడీ సిబ్బంది నిరసనలు, సమ్మె చేస్తుంటే వారితో చిత్తశుద్ధితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలనీ.. అలా చేయకుండా అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, వేతనంలో కోత విధించడం సమంజసం కాదని తెలిపారు. వెంటనే జీవో 2 ను ఉపసంహరించుకోవాలని కోరారు.