ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం : కార్మిక సంఘాలు

Mar 13,2024 12:34 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షకుల, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిఐటియు, ఏఐటియుసి, రైతు సంఘం, బికేఎంయు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని ఈనెల 14వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం రాజంపేట ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి ఈ.సికిందర్ అధ్యక్షతన కార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్ రాయుడు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవర, బికేయంయు రాజంపేట నియోజకవర్గ కార్యదర్శి జి.నరసింహులు పాల్గొని మాట్లాడుతూ 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా కార్మిక, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ధ్వజమెత్తారు. ఒకవైపున పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలను విపరీతంగా పెంచేసి, ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతుందని విమర్శించారు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పించిన నరేంద్ర మోడీ రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాల రాశారని మండిపడ్డారు. అదానీ, అంబానీలను కుబేరులను చేసి రైతులను, వ్యవసాయ కార్మికులను అప్పులు పాలు చేశారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చారన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం అవ్వాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సీ.టు 50 శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు నాగేశ్వరరావు, జి.గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️