ప్రజాశక్తి-యంత్రాంగం: లెనినిజం ఎప్పటికీ అజేయమని వక్తలు పేర్కొన్నారు. కారల్ మార్క్స్ ఏంగిల్స్ రూపొందించిన మార్క్సిజం సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి లెనిన్ అని కొనియాడారు. ఆ సిద్ధాంతానికి అనుగుణంగానే రష్యాలో సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం, సిపిఐ, ఎస్యుసిఐ (సి) ఆధ్వర్యంలో ఆదివారం విప్లవ సారథి లెనిన్ శత వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. విశాఖ నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం, నండూరి ప్రసాదరావు భవన్లో జరిగిన లెనిన్ శత వర్థంతి సభల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడారు. ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుంచి విముక్తి కలుగుతుందని అన్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తోందని, దీనిని బలంగా ఎదుర్కోవాల్సి ఉందని తెలిపారు. కర్నూలు జిల్లా కార్మిక కర్షక భవన్, సూర్జిత్ భవన్, సుందర్య సర్కిల్లో నివాళులర్పించారు. కర్షక భవన్లో ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యంలో లెనిన్ శత వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘లెనిన్ బాల్యాంజీవితం’ పుస్తకాన్ని, కేలండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి రామాలయం పేరుతో మత రాజకీయం చేస్తోందన్నారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బి శంకర్ శర్మ, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ వి లక్ష్మీనారాయణ , యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె సురేష్ కుమార్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగర మోహన్, ఆయా ప్రజాసంఘాల నాయకులు పాల్గన్నారు.గుంటూరు జిల్లా సిపిఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం గేయానంద్ మాట్లాడుతూ కారల్మార్క్స్, ఏంగెల్స్ రూపొందించిన కార్మికవర్గ సిద్ధాంతాన్ని ఆచరణలో సొవియట్ యూనియన్లో అమలు జరిపిన గొప్ప తత్వవేత్త లెనిన్ అన్నారు. మంగళగిరిలోని సిపిఎం కార్యాలయంలో, తాడేపల్లిలోని పలు ప్రాంతాల్లో, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం, పల్నాడు రోడ్డు, అమరావతి, చిలకలూరిపేట, క్రోసూరులోని సిపిఎం కార్యాలయంలో సభలు నిర్వహించి లెనిన్ చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి మాట్లాడారు. ప్రపంచంలో కార్మిక రాజ్యం, సోషలిజం నిర్మాత, మార్క్సిజాన్ని ఆచరణలో పెట్టిన మహా మేధావి లెనిన్ అని అన్నారు. పాలకొండ, సాలూరు, విజయనగరం ఎల్బిజి భవనంలో లెనిన్ శత వర్థంతి సభ జరిగింది.ఏలూరు జిల్లాలోని ఏలూరు, టి.నరసాపురం మండలాల్లో నిర్వహించారు. ఏలూరులోని పవర్పేట సిపిఎం జిల్లా కార్యాలయంలో, సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ, సిపిఎం జిల్లా శాఖల ఆధ్వర్యంలో లెనిన్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి ముద్రణాలయం, ప్రజాశక్తి బుకహేౌస్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన లెనిన్ చిత్రపటంతో ఉన్న కేలండర్ను, లెనిన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఒంగోలు సుందరయ్య భవన్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పునాటి ఆంజనేయులు మాట్లాడుతూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రాచరికం, వెట్టిచాకిరి, వలస పాలన విధానంపై మార్క్సిజం ద్వారా అంతమొందించిన లెనిన్ స్ఫూర్తితో నాయకులు ముందుకు సాగాలని సూచించారు. నాగులుప్పలపాడు ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించిన వర్థంతి కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై సిద్ధయ్య మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టు నాయకత్వాన కష్టజీవుల రాజ్యం కోసం (సోషలిస్ట్ రాజ్యం) పోరాడి సాధించిన మొట్టమొదటి మహోన్నత వ్యక్తి లెనిన్ అని పేర్కొన్నారు.తిరుపతి జిల్లా తిరుపతి నగరం యశోదానగర్లోని ఎంబి భవన్, నాయుడుపేట సిఐటియు కార్యాలయం, శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయం, గూడూరు పట్టణంలో, వైఎస్ఆర్ జిల్లా కడపలో సిపిఎం జిల్లా కార్యాలయం, జమ్మలమడుగులో, నెల్లూరు జిల్లా కందుకూరులో, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో, తాడేపల్లిగూడెంలో, పెంటపాడు, తణుకు కాకినాడలోని జడ్పి సెంటర్లో, రూరల్ మండలం వలసపాకలలో, అనకాపల్లి, రాంబిల్లి, కోటపాడు మండల కేంద్రాల్లో, శ్రీకాకుళం, టెక్కలిలో లెనిన్ శత వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజాశక్తి-విజయవాడ : సోషలిస్ట్ దేశ వ్యవస్థాపకుడు లెనిన్ శత వర్థంతి సందర్భంగా విజయవాడలోని లెనిన్ సెంటర్లో లెనిన్ కు వామపక్షాల నేతలు నివాళులు అర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు లెనిన్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విప్లవ సారధి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కళాకారులు పాటలతో ఉత్సాహపరిచారు. సోషలిజం అజయమని వారు కొనియాడారు. సోషలిజం వర్ధిల్లాలి.. క్యాపిటలిజం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నేతలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ముందుగా సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పేదల రాజ్యం స్థాపించి, సకల జనుల సోషలిస్టు సమాజానికి బాటలు వేసిన అక్టోబర్ విప్లవ సారధి వీఐ లెనిన్ శత వర్థంతి నిర్వహించారు. లెనిన్ చిత్ర పటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నేతలు పాల్గొని లెనిన్ కు నివాళులు అర్పించారు.
పెంటపాడు ప్రజాసంఘాల కార్యాలయం వద్ద లెనిన్ శత వర్ధంతి సభ
పశ్చిమ గోదావరి జిల్లా : ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మిక రాజ్యాన్ని నిర్మించడంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి లెనిన్ మహాశయాడు శత వర్ధంతి సందర్భంగా పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో వర్ధంతి సభ జరిగింది. ఈ సభలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, సిఐటియు జిల్లా నాయకులు సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు , కర్రీ సాయి రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. లెనిన్ చిత్రపటానికి చింతకాయల బాబురావు పూలమాలవేసి జోహార్లు అర్పించారు .
నెల్లూరు జిల్లా – సీపీఎం జిల్లా కార్యలయంలో IV లెనిన్ శతవర్ధంతి సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా సిపిఎం, సిపిఐ నాయకులు
అనకాపల్లి జిల్లాలో…. విశ్వ మానవాళి విముక్తి కోసం పోరాడి రష్యాలో మొట్ట మొదట దోపిడి లేని కార్మిక రాజ్యం స్థాపించిన మహానీయుడు వి. ఐ. లెనిన్ శత వర్ధంతి సందర్భంగా అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి కె.లోకనాథం.
శ్రీకాకుళంలో లెనిన్ కు సిపిఎం నాయకుల నివాళి…